Telugu Fast News: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 24న విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ ఏడాది పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు ఒకేసారి వెల్లడించనుంది.
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. మార్చి 10 నుంచి ఈ నెల 10 వరకు మూల్యాంకనాన్ని పూర్తి చేశారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే ఫలితాలు ప్రకటించనున్నారు. మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఈ నెల మొదటి వారంలో ఓఎంఆర్ షీట్ల డీ కోడింగ్ చేశారు. మార్కులు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేశారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఫలితాలను విడుదల చేయనున్నారు.