కట్టుకున్న వాడే కాలయముడవుతున్నాడు. పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకుని కలకాలం తోడుంటానన్న భర్తే హంతకుడిగా మారుతున్నాడు. అనుమానంతో ఒకడు.. ఆస్తి కోసం మరొకడు.. ఆవేశంతో ఇంకొకడు.. ఇలా మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచిన భర్తలే భార్యలను అత్యంత క్రూరంగా హత్య చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా(Rangareddy District )లో అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాలకాలం తోడుంటానని అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి భర్తే అతికిరాతకంగా భార్యను హతమార్చాడు. రాచకొండ కమిషనరేట్(
Rachakonda Commissionerate) మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో పోలీసులకు విస్తూపోయే నిజాలు తెలిశాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను ముక్కలుముక్కలు నరికి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా డెడ్‌బాడీని కుక్కర్‌లో ఉడికించాడు. మిగతా శరీర భాగాలను జిల్లెల్లగూడ చందన చెరువులో పారేశాడు.

చేసిందంతా చేసి.. ఏ విషయం తెలియనట్లుగా..

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రకాశం జిల్లా JP చెరువుకు చెందిన గురుమూర్తి(Gurumurthy) మాజీ సైనికుడు. వృత్తి రీత్యా DRDOలో ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంటక మాధవి(35)తో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నెల 13న మాధవి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదు చేస్తున్న సమయంలో తనకు ఏ విషయం తెలియనట్లుగా గురుమూర్తి అత్తామామలతో కలిసి మీర్‌పేట పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. అయితే, విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. గురుమూర్తే తన భార్యను చంపాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తన భార్యని చంపడానికి ముందు కుక్కను చంపినట్లు తేలింది.