
జెంటిల్మెన్, భారతీయుడు, అపరిచితుడు, రోబో లాంటి సూపర్హిట్ మూవీస్ అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్ (Director Shankar) మొట్టమొదటిసారి గ్లోబల్స్టార్ రామ్చరణ్తో డైరెక్ట్ తెలుగు మూవీ తెరకెక్కించారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో శంకర్ వరుస ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమర్శల నుంచి ఎవరూ తప్పించకోలేరన్నారు. తాను కేవలం ఒకేఒక్కరి బయోపిక్ తీస్తానని.. అది తలైవా రజినీ కాంత్దేనని అన్నారు.
శంకర్ డైరెక్షన్లో గతేడాది రిలీజై ప్రేక్షకులను అలరించలేకపోయింది ‘ఇండియన్ 2’. దీంతో సోషల్ మీడియాలో శంకర్పై విమర్శలు వచ్చాయి. వీటిపైనా తాజా ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ.. ‘విమర్శలను ప్రతిఒక్కరూ జీవితంలో ఏదోఒక సమయంలో ఎదుర్కోవాల్సిందే. వాటినుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎవరైనా.. దేనినైనా విమర్శించొచ్చు. అయితే, వాటినుంచి మనం ఏం నేర్చుకున్నామనేది ముఖ్యం. ఆ విమర్శలను సవాలుగా తీసుకొని తర్వాత ప్రాజెక్ట్ను మెరుగ్గా తీయాలి. ప్రస్తుతం గేమ్ ఛేంజర్తో నేను బిజీగా ఉన్నాను. ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత భారతీయుడు 3 పనులు ప్రారంభిస్తాను’ అని అన్నారు.
ఆయన మాట్లాడుతూ..‘రజినీకాంత్ గొప్ప వ్యక్తి. ఈ విషయం ఎంతోమందికి తెలుసు. నాకు ప్రస్తుతానికి బయోపిక్ను తెరకెక్కించాలనే ఆలోచన లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే రజినీకాంత్ (Rajinikanth) బయోపిక్నే తీస్తాను’ అని అన్నారు. ఈ కామెంట్స్ సినీప్రియుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఫ్యూచర్లో శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ బయోపిక్ వస్తుందని ఆశిస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే శివాజీ, రోబో లాంటి సూపర్హిట్ మూవీస్ వచ్చాయి.