ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు(Telangana Intermediate Board) గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్(Syllabus) తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు కెమిస్ట్రీ, ఫిజిక్స్​తోపాటు పలు సబ్జెక్టుల్లో సిలబస్​ను కుదించే యోచనలో ఉంది. తగ్గించిన సిలబస్‌ను 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్​లో అమలు చేయనున్నట్లు బోర్డ్ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,700లకుపైగా ఇంటర్​ కాలేజీలుండగా, వాటిలో 9.5లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, పరిమితికి మించి పలు సబ్జెక్టుల్లో సిలబస్ ఉన్నట్టు బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో సిలబస్​లో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు(Intermediate Board) భావించింది.

ఎన్​సీఈఆర్టీ(National Council of Educational Research and Training) సూచించిన సిలబస్ తోపాటు అడిషనల్ సిలబస్ ఉండడంతో దాన్ని తొలగించాలని నిర్ణయించింది. మరో పక్క JEE, NEET​తోపాటు జాతీయస్థాయి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని, సిలబస్ కుదించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ఈ వారంలోనే సబ్జెక్టుల వారీగా ఎక్స్‌పర్ట్ కమిటీ(Expert Committees)లను ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. వారి ఆధ్వర్యంలో ఏ చాప్టర్లు తొలగించాలని, ఏ చాప్టర్​లోని అంశాలను తగ్గించాలని అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈమేరకు ఫస్టియర్, సెకండియర్ కెమిస్ట్రీలో 30% మేర కోత విధించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 6 చాప్టర్లను తొలగించనున్నారు. ఫిజిక్స్(Physics) లోనూ సుమారు 15% వరకు సిలబస్ తగ్గించాలని యోచిస్తున్నారు. దీంతో రెండు లేదా మూడు చాప్టర్లకు కోత పెట్టనున్నారు. బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లోనూ 5 నుంచి 10% వరకు సిలబస్‌ను తగ్గించనున్నారు. దీంతో పాటు ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టుల్లోనూ కొంత సిలబస్ తగ్గనుంది. అయితే మొదటి సంవత్సరం విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరం నుంచి, సెకండియర్ విద్యార్థులకు 2026–27 నుంచి కొత్త సిలబస్ అమలు కానుంది.