Dasari

Dasari Narayana Rao:   దర్శకరత్న జయింతి..చిత్ర పరిశ్రమలో  డైరక్టర్స్​ డే

Dasari Narayana Rao:   దర్శకరత్న జయింతి..చిత్ర పరిశ్రమలో  డైరక్టర్స్​ డే

Telugu Fast News: దాసరి జయంతిని తెలుగు సినీ పరిశ్రమ డైరెక్టర్స్ డే గా పరిగణిస్తూ గత కొన్నేళ్ళుగా వేడుకలు చేస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున వేడుకలు చేయడానికి  సిద్ధమైంది. అయితే ఎల్బీ స్టేడియంలో జరగాల్సిన ఒక భారీ వేడుక వాయిదా పడింది కానీ ఈరోజు ఫిలిం చాంబర్లో దర్శకుల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరపబోతున్నారు.

తెలుగు సిల్వర్​ స్ర్కీన్​పై దర్శకరత్న దాసరి నారాయణరావుది చెరిగిపోని సంతకం.ఆయన భౌతికంగా దూరమై అయిదేళ్ళయింది. ఇంకా దాసరి 151 చిత్రాల రూపకల్పనతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన మేటి దర్శకుడు దాసరి. టాప్ స్టార్స్​ నుంచి, అప్ కమింగ్ ఆర్టిస్టుల వరకు చిత్రాలు తెరకెక్కించి ఘనవిజయాలను దాసరి సొంతం చేసుకున్నారు . 

ఇక ఆయన సినిమా వచ్చిందంటే చాలు జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆబాలగోపాలాన్నీ అలరించే చిత్రాలను రూపొందించి మెప్పించారు దాసరి. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే , నిర్మాణం, దర్శకత్వం ఇలా పలు శాఖల్లో తనదైన బాణీ పలికించిన మేటి దాసరి! ఆయన బహుముఖ ప్రజ్ఞ మనలను పలకరిస్తూనే ఉంటుంది.

దాసరి నారాయణరావు 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఆయన తండ్రి సగటు జీవి. చాలీచాలని సంపాదన, అయినా దాసరిలో చదువుకోవాలన్న తపన ఉండేది. చిన్నతనంలోనే పనిచేస్తూ చదువుకున్నారు. హైస్కూల్ రోజుల్లోనే నాటకాలు రాసి, నటించి మెప్పించారు. డిగ్రీ పూర్తయ్యాక కూడా అదే పంథాలో సాగారు. చదువులో తెలివైన వారు కావడంతో హైదరాబాద్ హెచ్.ఏ.ఎల్. సంస్థ పెట్టిన పరీక్షలో నెగ్గి టైపిస్ట్ గా ఉద్యోగం సంపాదించారు. బాలనగర్ లో ఉద్యోగం చేస్తూనే రవీంద్రభారతిలో నాటకాల వేసేవారు. 

అలా ఓ సినిమా వ్యక్తి ప్రోత్సాహంతో అమాయకంగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, మద్రాసు వెళ్ళారు. అక్కడ ఆరంభంలోనే ఓ చిన్న వేషానికి మాత్రమే పాత్రులయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కోవాలి అన్న సంకల్పంతో చిత్రసీమలోనే ఉంటూ కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. కొందరికి ఘోస్ట్ రైటర్ గానూ ఉన్నారు. పాలగుమ్మి పద్మరాజు పరిచయంతో ఆయనతో కలసి పలు సినిమాలకు పనిచేశారు. రచయితగానూ మంచి పేరు సంపాదించారు. ఫల్గుణ ఫిలిమ్స్ అపరాధ పరిశోధన చిత్రాలకు తనదైన శైలిలో మాటలు రాసి అలరించారు. తెలుగునాట “గూట్లే, డోంగ్రే…” వంటి పదాలకు విశేషాదరణ లభించేలా చేసింది దాసరి కలం. ఫల్గుణలో పార్ట్ నర్ గా ఉన్న కె.రాఘవ బయటకు వచ్చి ‘ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్’ స్థాపించారు. దాసరిని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘తాత-మనవడు’ నిర్మించారు. తొలి చిత్రంతోనే దాసరి నారాయణ రావుకు ఎంతో పేరు లభించింది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు.

 నటరత్నతో దర్శకరత్న తెరకెక్కించిన “మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, విశ్వరూపం, బొబ్బిలిపులి” చిత్రాలన్నీ శతదినోత్సవాలు చూశాయి. వాటిలో ‘సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి” బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. యన్టీఆర్ తో దాసరి తెరకెక్కించిన అన్ని చిత్రాలలోనూ నటరత్న నటనావైభవం నభూతో నభవిష్యత్ అన్న చందాన సాగింది. ఆ వైనాన్ని ఈ నాటికీ ఎవరూ మరచిపోలేరు. 

‘దేవదాసు’ చూసి, అక్కినేని వీరాభిమానిగా మారిన దాసరి నారాయణరావు, ఏయన్నార్ తో ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ అని తెరకెక్కించారు. అదంతలా ఒప్పించకపోయినా, దాసరిలోని క్రియేటివిటీని చూసి జనం మెచ్చారు. తరువాత పలు చిత్రాలలో తన అభిమాన నటునితో పయనించి ఆకట్టుకున్నారు. వాటిలో అన్నిటికన్నా మిన్నగా అలరించిన చిత్రం ‘ప్రేమాభిషేకం’ అనే చెప్పాలి. ఇందులో అక్కినేని అభినయం, దాసరి దర్శకత్వం తెలుగువారిని విశేషంగా మురిపించాయి.
 


Comment As:

Comment (0)